ఇక చిప్ప పట్టుకుని మిత్రదేశాల వద్దకు వెళ్లం.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌

  • మిత్ర దేశాలు పాక్‌ను ‘అర్థించే దేశం’గా చూడటం లేదన్న పాక్ ప్రధాని
  • వాణిజ్యం, పెట్టుబడుల్లో భాగస్వామిగా పరిగణిస్తున్నాయన్న ప్రధాని
  • చైనా, సౌదీ, యూఏఈ వంటివి నమ్మకమైన మిత్రదేశాలని ఉద్ఘాటన
  • దేశ వనరులతో ఆర్థిక సవాళ్లను అధిగమిస్తామని వెల్లడి
మిత్రదేశాలు తమను కేవలం సహాయం అర్థించే దేశంగా చూడటం లేదని.. వాణిజ్యం, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణల్లో సమాన భాగస్వామిగా పరిగణిస్తున్నాయని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "పాకిస్థాన్‌కు చైనా ఎప్పుడూ అండగా నిలిచే మిత్రదేశం. అలాగే సౌదీ అరేబియా, తుర్కియే, ఖతర్‌, యూఏఈ, అజర్‌బైజాన్‌ వంటి దేశాలు కూడా అత్యంత విశ్వసనీయమైన స్నేహితులు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ మాతో వాణిజ్యం, ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాయి. మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు రావాలని వారు కోరుకోవడం లేదు" అని పేర్కొన్నారు.

బలోచిస్థాన్‌లోని క్వెట్టా కమాండ్‌ అండ్‌ స్టాఫ్‌ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో షెహబాజ్ ప్రసంగిస్తూ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్‌తో పాటు దేశ ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని చెప్పారు. దేశంలో సహజ వనరులతో పాటు మానవ వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయని, వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సవాళ్లను అధిగమించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు, పాకిస్థాన్‌ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీని ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్యాకేజీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల నిధులను ఐఎంఎఫ్‌ మంజూరు చేసింది. అయితే, ఈ నిధుల విడుదలకు పలు కఠిన షరతులను విధించిన ఐఎంఎఫ్.. భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకుంటే అది పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుందని హెచ్చరించింది. అలాంటి చర్యలు దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ఆటంకం కలిగిస్తాయని ఐఎంఎఫ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం.

Shehbaz Sharif
Pakistan
Pakistan economy
IMF
China
Saudi Arabia
экономического кризиса
Bailout package
экономического кризиса
Trade and Investment

More Telugu News